రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి గొంతు కోశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.ఆమె శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ....ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. హామీల అమలుపై వైఎస్ జగన్ మాట్లాడుతున్నారే కానీ, ఆయన వ్యక్తిగత సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు ఇలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష నేతగా ఆయన ఇంకా గట్టిగా మాట్లాడతారని వాసిరెడ్డి పద్మ అన్నారు.టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా వైఎస్ జగన్ ను దూషిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ సహనంతో ఉన్నారని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రజల కష్టంపై మాట్లాడితే హీనాతిహీనంగా విమర్శిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం ఉన్నవారెవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నలు సంధించారు.చంద్రబాబును ఒక్క మాట అన్నందుకే ఇంత కోపం వస్తే జగన్ అన్ని మాటలు అంటుంటే మాకెంత కోపం రావాలని ప్రశ్నించారు.